
హైదరాబాద్, వెలుగు: గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గ్రూప్–1 మెయిన్స్ పేపర్ మూల్యాంకనం పారదర్శకంగా జరగలేదని, తిరిగి మూల్యాంకనం చేసేలా టీజీపీఎస్సీకి ఉత్తర్వులు ఇవ్వాలని ఎస్.నరేష్ సహా 23 మంది వేసిన పిటిషన్లను జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు సోమవారం విచారించారు.
అడ్వకేట్ అనిరుధ్ సాధు వాదిస్తూ.. మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనం లోపభూయిష్టంగా జరిగిందని.. మొత్తం 18 రకాల సబ్జెక్టులుంటే.. 12 రకాల సబ్జెక్టుల నిపుణులతోనే పేపర్లు దిద్దించారన్నారు. మూడు భాషల్లో పరీక్ష నిర్వహించినా తగిన నిపుణులను ఏర్పాటు చేయలేదని.. తెలుగు, ఆంగ్లం మీడియం పేపర్లను ఒకే నిపుణులతో మూల్యాంకనం చేయించారని పేర్కొన్నారు.
ఈ కారణంగా తెలుగు, ఉర్దూ భాషలలో పరీక్షలు రాసిన అభ్యర్థులు మార్కులను కోల్పోయే అవకాశం ఉందన్నారు. రాష్ట్రం వెలుపల నుంచి వచ్చిన నిపుణులకు తెలంగాణ ఉద్యమం, స్థానిక చరిత్ర వంటి అంశాలపై నైపుణ్యం లేదని, పేపర్ల పునఃమూల్యాంకనం చేయాలని అభ్యర్థించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించారు. విచారణను ఏప్రిల్ 21కి వాయిదా చేశారు.